21 November 2010

నీవలన కొరతేలేదు...

మనం దేవుడికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఎన్ని మతాలనెంచుకున్నా, దేవుడన్న నమ్మకం ఒకటే. ఏ పేరుతో పూజిస్తున్నా, ఎంత నమ్మకంతో, ఎంత చిత్తశుద్ధితో పూజిస్తామో అంత ఫలము దక్కుతుంది. కొలనులో నీటి మట్టం పైకున్నపుడు అందులో తేలుతున్న తామరపువ్వూ పైనే ఉంటుంది, నీళ్ళు తగ్గినపుడు నీటి మట్టంతోబాటు తామరపువ్వు కిందకి వెళ్ళిపోతుంది. అలానే మనసు నిర్మలంగా, నిస్వార్థ బుద్ధితో కొలిచినవారిని కరుణతో ఆదుకుంటాడు దేవుడు. కొలిచినవారి బుద్ధిని బట్టి ఫలితం ఉంటుందని చెప్తున్నారు అన్నమయ్య ఈ కీర్తనలో.


===============================================
రాగం : బౌళి 
===============================================
పల్లవి                                         
ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు
అంతరాంతరములు ఎంచిచూడ పిండంతే నిప్పటి అన్నట్లు

చరణం 1
కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు
అలరిపొగడుదురు కాపాలికులు ఆది భైరవుడవనుచు

చరణం 2
సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు
దరిశనముల మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురు
సిరుల మిమ్మునే అల్పబుద్ధి తలచిన వారికి అల్పం బవుదువు
గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు

చరణం 3
నీవలన కొరతేలేదు మరి నీరుకొలది తామెరవు
ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీవేంకటపతి నీవైతే మము చేకొనివున్న దైవమని
యీవల నే నీ శరణనియెదను ఇదియే పరతత్వము నాకు

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు /  Meaning (సందర్భోచితమైన అర్థాలు)  :
అంతరాంతరములు = తారతమ్యము, తేడా
నిప్పటి = అరిసెలు, రాయలసీమలో ఇప్పటికీ నిప్పట్లు అనే అంటారు
కొలుతురు = మ్రొక్కుదురు,  సేవింతురు, ఉపాసింతురు
వైష్ణవులు = విష్ణుని పూజించువారు
కూరిమితో = ప్రేమతో, స్నేహముతోఅలరిపొగడుదురు = ఉత్సాహముగ(తాండవమాడుతూ) పొగడుదురు;
కాపాలికులు = ఉగ్రరూప శివుణ్ణి పూజించువారు, ఇప్పటికి వీరు కేరళ, తమిళనాడులో కాపాలికులుగానే గుర్తింపబడుతారు.
ఆదిభైరవుడు = ఉగ్రరూపు దాల్చిన ఈశ్వరుడు, గ్రామరక్షక దేవుడు, సుడలై మాడసామి, అయ్యనార్ సామి.
భజింతురు = సేవింతురు, మ్రొక్కుదురు
సిరులమిమ్మునే = ధన, ధాన్యాలను ఇవ్వమనే
అల్పబుద్ధి = నీచమైన బుద్ధి
గరిమ = మేలిమి; గౌరవమైన
నీరుకొలది = నీటిమట్టానికి
తామెర = పద్మము, తమ్మిపువ్వు, కమలము
ఆవల = అవతల, అటుపక్కనే
భాగీరథి = (గంగా) నది
దరి = గట్టు
బావి = నుయ్యి
చేకొని = అనుగ్రహించిన
పరతత్వము = అన్ని(దైవ) తత్వములు
 

తాత్పర్యం :
 
పిండి పరిమాణాన్నిబట్టి అరిసెయొక్క పరిమాణం. అలానే, ఎంతమాత్రం నిన్ను వేడుకుంటే అంత ఆదుకుంటావు.

వైష్ణవులు నిన్ను ముద్దుగా, ప్రేమగా విష్ణువంటారు. వేదాంతులు నువ్వే పరబ్రహ్మం అంటారు. శైవులు నిన్నే శివుడని అంటారు. కాపాలికులు తమని రక్షించే భైరవుడవు నీవని తాండవమాడుతూ పొగడుతారు.

శాక్తేయులు శక్తిరూపంగా ఎన్నుకున్నదీ నిన్నే. నానా వర్గాలవారు, నానాపేర్లతో దర్శించి పూజించేది నిన్నే. ఏ పేర్లతో నిన్ను పూజించినా, ధన ధాన్యాలూ, సిరులూ ఇవ్వమని పూజించే అల్పబుద్ధి కలిగిన వారికి అందవు నీవు. నిస్వార్థముతో, నిర్మల మనసుతో పూజించేవారిని ఘనంగా ఆదుకొనెదవు నీవు.

నీవలన కొరతేలేదు! నీటి మట్టాన్నిబట్టి తామెరపువ్వు తేలుతుంది (1). నిండుగా సాగే ఏటి పక్కన ఉన్న బావిలో నీరెలాగైతే ఇంకిపోకుండ ఊరునో(2) అలాంటిది నీ కరుణ ఓ వేంకటపతీ.  నీవే శరణు అనుకోవడమే పరతత్వము నాకు.
------------------------------------------------------------------
cf., (1)
వెళ్ళత్ తనైయ మలర్ నీట్టం మాందర్ తం
ఉళ్ళత్ తనైయదు ఉయర్వు.
-తిరువళ్ళువర్ (30 BC)
(வெள்ளத் தனைய மலர்நீட்டம் மாந்தர்தம்
உள்ளத் தனையது உயர்வு.)
అనగా, నీటిమట్టాన్ని బట్టి నీటిలోతేలే పువ్వు పెరుగుదల ఉంటుంది. అలాగే, మనుషుల ఉత్సాహాన్నీ, ప్రేరణనీబట్టి వారి ఎదుగుదల ఉంటుంది.

cf., (2)
తొట్టనైత్ తూఱుం మణఱ్ కేణి మాందర్ క్కుక్
కఱ్ఱనత్ తూఱుం అఱివు.
-తిరువళ్ళువర్ (30 BC)
(தொட்டனைத் தூறும் மணற்கேணி மாந்தர்க்குக்
கற்றனைத் தூறும் அறிவு)
ఏటిపక్కనున్న ఇసుకలో ఎంతకెంత(బావి) త్రవ్వితే అంతకంత నీరు ఊరుతుంది. అటులనే ఎంతకెంత చదువుతూ ఉంటే అంతకంత జ్ఞానం వస్తుంది.
------------------------------------------------------------------


ఈ కీర్తనకు మిత్రులు కొందరు ఇచ్చిన వివరణలు / తాత్పర్యాలు :



భాషా విశేషాలు -
సామెతలు
ఇందులో నాకు రెండు సామెతలు గోచరిస్తున్నాయి.
1. పిండి కొద్ది నిప్పట్టు - పిండి కొద్ది అత్తిరసం - పిండి కొద్ది అరిసె - పెండి కొద్ది రొట్టె , ఇది బహుశా మన పిండి కొద్ది రొట్టె సామెతకు జేజమ్మ అయ్యుంటుంది.
2. నీరు కొలది తామెరవు
ఇది కూడా మరో పురాతనమైన తెలుగు (ద్రావిడ) సామెతలాఉంది. చాలా మంచి సామెత. మనకు ఇప్పుడు నీరు పల్లమెరుగు (అర్థం వేరు) అనే సామెత వాడకంలో ఉంది కాని నీరు కొలది తామెరవు కనుమరుగైనట్టుంది.

మరొక విశేషం ఏమిటంట వేంకటేశ్వరుని ఇప్పటికీ కొందరు నిజంగానే శివునిగా, శక్తిగా, మురుగన్ గా, బుద్దునిగా, జైనునిగా వాదించేవారు ఉన్నారు. బహుశా అన్నమయ్య కాలంనాటికి కూడా వీరంతా ఉండి ఉండేవారేమో.

సర్వం ఆ గోవిందుని లీలే కదా.


Sravan Kumar DVN :

"ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు"  
-- అంటే, గంగా నది  పక్కన బావి తవ్వకుంటే  గంగా జలమే ఆ బావిలోకి ఊరుతాయి. మనం ఆ నేళ్ళని బావి నీళ్ళనుకుంటే బావి నీళ్ళు, గంగాజలం అనుకుంటే అదే పుణ్య తీర్తం. ఆలాగే సర్వాంతర్యామి ఒక్కడే, నువ్వు ఏ పేరు పెట్టు పిలుచుకున్నా.




శైలజ గారు:


పిండి పరిమాణాన్నిబట్టి అరిసెయొక్క పరిమాణం. అలానే, ఎంతమాత్రం నిన్ను వేడుకుంటే అంత ఆదుకుంటావు

ఇక్కడ ఆయన ఆదుకోవటం లో తేడా ఏం ఉండదు. మనం భావన చెయ్యడం లో ఉండే తేడా మాత్రమే. ఎంత తలిచిన వారికి, అంత గోచరిస్తాడు ఆయన. మనం తలచిన కొద్ది మనకి అనుభవం లోకి వస్తూ ఉంటుంది ఆయన తత్వం, ఆయన రూపం వంటివి

నీవే శరణు అనుకోవడమే పరతత్వము నాకు.

ఇక్కడ నీవు శరణు అనుకోవడం పరతత్వం కాదు. శ్రీవెంకటపతివి నీవే అయితే, నాచే చేకొనబడిన దైవము నీవే, నువ్ నాలో ఉన్నావ్ కనుకనే(నీకు శరణు వేడే తత్వం ఒక మనిషి గా నాది కాదేమో,నీవు నాలో ఉండటం వలన కలిగిన ఇది నాకు. అది పరతత్వం  నాకు). నీకు శరణు వేడాలనే తలపు నాకు కలిగింది. అందువలననే నీకు నే శరణను అన్నాను. ఇది యె పరతత్వం నాకు.నాలో ఉన్న నీకు నేను శరణు అనటమే పరతత్వం నాకు.

------------------------------------------------------------------

raagaM : bauLi
pallavi                                    
entamaatramuna evvaru talachina antamaatramE neevu
antaraantaramulu enchichooDa pinDantE nippaTi annaTlu

charaNaM 1
koluturu mimu vaishNavulu koorimitO vishNuDani
palukuduru mimu vEdaantulu parabrahmaMbanucu
talaturu mimu Saivulu tagina bhaktulanu SivuDanucu
alaripogaDuduru kaapaalikulu aadi bhairavuDavanucu

charaNaM 2
sarinennuduru SaaktEyulu Saktiroopu neevanucu
dariSanamula mimu naanaavidhulanu talapula koladula bhajinturu
sirula mimmunE alpabuddhi talachina vaariki alpaM bavuduvu
garimala mimunE ghanamani talachina ghanabuddhulaku ghanuDavu

charaNaM 3
neevalana koratElEdu mari neerukoladi taameravu
aavala bhaageerathi dari baavula aa jalamE UrinayaTlu
SreevEnkaTapati neevaitE mamu chEkonivunna daivamani
yeevala nE nee SaraNaniyedanu idiyE paratatvamu naaku



================================================================

4 comments:

  1. bhaskar garu , naku telisi idi ragamalika anukunta, bauli kademo , check cheyyandi.

    ReplyDelete
  2. Sravan,
    paaTavinTE naakU alaanE anipistundi. annamayya original gaa bauLi raagaMlOnE raaSaaDu. swaraparichinavaaLLu deenini bauLilO swaraparachalEkapOyaarEmO :)

    MS Subbulakshmi gaari version kUDaa bauLilO swaraparachalEdu. andulO vErE reMDu raagaalu unnaayi.

    nEnikkaDa swaraparachina raagaalu peTTaalanukOlEdu. annamayya E raagamaitE mention chESaaDO aa raagaannE ikkaDa peDutunnanu.

    ReplyDelete
  3. Adding some more details
    భాషా విశేషాలు -
    సామెతలు
    ఇందులో నాకు రెండు సామెతలు గోచరిస్తున్నాయి.
    1. పిండి కొద్ది నిప్పట్టు - పిండి కొద్ది అత్తిరసం - పిండి కొద్ది అరిసె - పెండి కొద్ది రొట్టె , ఇది బహుశా మన పిండి కొద్ది రొట్టె సామెతకు జేజమ్మ అయ్యుంటుంది.
    2. నీరు కొలది తామెరవు
    ఇది కూడా మరో పురాతనమైన తెలుగు (ద్రావిడ) సామెతలాఉంది. చాలా మంచి సామెత. మనకు ఇప్పుడు నీరు పల్లమెరుగు (అర్థం వేరు) అనే సామెత వాడకంలో ఉంది కాని నీరు కొలది తామెరవు కనుమరుగైనట్టుంది.

    మరొక విశేషం ఏమిటంట వేంకటేశ్వరుని ఇప్పటికీ కొందరు నిజంగానే శివునిగా, శక్తిగా, మురుగన్ గా, బుద్దునిగా, జైనునిగా వాదించేవారు ఉన్నారు. బహుశా అన్నమయ్య కాలంనాటికి కూడా వీరంతా ఉండి ఉండేవారేమో.

    సర్వం ఆ గోవిందుని లీలే కదా.

    ReplyDelete
  4. భాస్కర్ గారు, ఈ సంకీర్తన మొట్ట మొదట నిన్నపుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అన్నమయ్య వైష్ణవ మతం స్వీకరించాడు కదా! అందువలన అతని సంకీర్తనలలో శివుని ప్రస్తావన ఎలా వచ్చిందని. అయితే దీని వలన తెలిసినదేమిటంటే వైష్ణవం అంటే కేవలం విష్ణుమయమే కాదు, సకలదేవతా స్వరూపం అయిన పరతత్వమే ప్రధానం అని తెలుస్తుంది. దీనిని ఛాందసులు ఒక పాఠంగా తీసుకుంటే బాగుంటుంది. కాని ఏళ్ళ తరబడి జీర్ణించుకున్న అపోహలు అంత సులభంగా తొలగుతాయనుకోను.

    ReplyDelete